కంటోన్మెంట్, ఏప్రిల్ 11: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని, మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సన్నాహక సమావేశం జరిగింది. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సాయన్న సేవలను అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. ఏడాది కాలంలోనే ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనందితను కోల్పోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే తిరిగి తెలంగాణ ప్రాంతాన్ని తమ నీచ రాజకీయాలతో ఏడారిగా మారుస్తున్నదని మండిపడ్డారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని, అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.