MLA Malla Reddy | కంటోన్మెంట్, ఏప్రిల్ 22: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయకుండా మరిచారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్లో కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని.. ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కల్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదన్నారు. నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం దేవుడెరుగు, ఇచ్చే రెండు వేల కూడా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రెండు నెలల పెన్షన్ పెండింగ్లో ఉందని దుయ్యబట్టారు. 24గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, కరెంట్ రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని మల్లారెడ్డి అన్నారు. సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, అనితాప్రభాకర్, లోక్నాథం, నళినికిరణ్, శ్యామ్కుమార్, మాజీ కార్పొరేటర్ రూప, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎం రేవంత్రెడ్డి కంటోన్మెంట్లో గద్దర్ బిడ్డకు టికెట్ ఇవ్వకుండా పూటకో పార్టీ మారే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. గద్దర్పై ఎనలేని అభిమానం చూపినట్లు నటిస్తూనే..ఆయన కూతురు వెన్నెలకు అవకాశం ఇవ్వకుండా.. మహిళలను కాంగ్రెస్ చులకనగా చేస్తున్నదని మండిపడ్డారు. నివేదితను ఎమ్మెల్యేగా, రాగిడి లక్ష్మా రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సొంత ఇల్లు కూడా లేదని, జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేశారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. అనతి కాలంలోనే తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చిన నివేదితకు అండగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తున్నదని, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని సూచించారు.
తనను ఆశీర్వదిస్తే, సేవకుడిగా ఉంటానని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తారని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘తెలంగాణ కోసం కోట్లాడింది కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్.. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించిన నాయకుడిని మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. కంటోన్మెంట్లో నివేదితను భారీ మెజార్టీతో గెలిపించుకోవడంతో పాటు మల్కాజిగిరి ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో సాయన్న చేసిన పనులను ఎవరూ మర్చిపోరని గుర్తు చేశారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి, చెల్లి మాదిరిగానే తనను ఆశీర్వదించాలని కోరారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.