BRS | మేడ్చల్, మార్చి17(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా ఆదివారం బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్కుమార్, దయానంద్ సమావేశంలో పాల్గొన్నారు.
రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి నగర ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉండటంతో భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేందుకు ప్రజల మద్దతును కూడకట్టే విధంగా ప్రచారం చేయాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. కాగా, అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా అభినందించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిచేది బీఆర్ఎస్సేనని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలువడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే తరహాలో గ్రేటర్ ప్రజలందరూ బీఆర్ఎస్కే మద్దతు ఇస్తారన్న పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని చెప్పారు.
ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందాయన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తనకు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు.