వెంగళరావునగర్, డిసెంబర్ 13 : పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో క్రిస్మస్ కానుకలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. క్రిస్మస్ కానుకలో పురుషులకు ప్యాంటు, షర్ట్ పీసులు, మహిళలకు చీర, డ్రెస్ మెటీరియల్ ఉంటుందన్నారు. క్రైస్తవుల పండుగ క్రిస్మస్ను గుర్తించి ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజకుమార్పటేల్, పాస్టర్ ఏసురాజు, భారత రాష్ట్ర సమితి డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్ తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ చర్చి వద్ద ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రైస్తవులను గత పాలకులు పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, ఫాస్టర్ కరుణాకర్, భారత రాష్ట్ర సమితి డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, విజయ్కుమార్, జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్, గజ్జల బాలకృష్ణ, సత్యనారాయణ, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.