జూబ్లీహిల్స్, సెప్టెంబర్14: పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని, పనిచేసే వారికే పదవులు కట్టబెడతామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మంగళవారం యూసుఫ్గూడ మహ్మద్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్ అధ్యక్షతన డివిజన్ నూతన కమిటీని, అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని, అయితే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సోషల్ సైనికుల్లా మారి ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని పేదలకు అందేలా చూడటమే కాకుండా అదే సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసత్య ప్రచారాలను అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేస్తున్న మేలును వివరించాలని సూచించారు. నగరంలో హిందూ, ముస్లింలకు ఘర్షణలు పెట్టే బీజేపీకి, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు.
150 డివిజన్లలో రాజ్కుమార్ పటేల్ యంగ్ కార్పొరేటర్గా ఉన్నారని, దానికి అనుగుణంగానే డివిజన్ కమిటీలో సింహభాగం యువ నాయకత్వానికే అవకాశం దక్కిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. నూతన కమిటీకి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తామని, ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలను మర్చిపోమని హామీ ఇచ్చారు. యువ నాయకత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.
యూసుఫ్గూడ డివిజన్ అధ్యక్షుడిగా నీలం సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఐలపాక నర్సింగ్దాస్, బీసీసెల్ ప్రెసిడెంట్గా నాగరాజు, ప్రధాన కార్యదర్శి సైలేజ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా రమ, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా అజీమ్, మహిళా కమిటీ ప్రెసిడెంట్గా కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా నిర్మలా రెడ్డి, యూత్ కమిటీ ప్రెసిడెంట్గా అబ్బులతో పాటు పూర్తిస్థాయి కమిటీలను నియమించారు.