ఎర్రగడ్డ, జూలై 18: రక్తదాన శిబిరాన్ని విజయవం తం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ఆదివారం బోరబండ డివిజన్ తుర్రెబాజ్ఖాన్ కమ్యూనిటీహాల్, ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్నగర్ కాలనీ కమ్యూనిటీహాళ్లలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ శ్రేణులతో పాటు ఇతరులు రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీమేయర్.. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ డివిజన్ నుంచి రక్తదానం చేయటానికి అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. వారందరూ ఈ నెల 24న ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. డివిజన్ల అధ్యక్షులు సంజీవ, కృష్ణమోహన్, నేతలు విజయకుమార్, పల్లవియాదవ్, గంట మల్లేశ్, ముత్యాలు, రవినాయుడు, రాము, మహ్మద్సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్,జూలై 18: మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 24న తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ డివిజన్, ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు భారీగా రక్తదానానికి తరలిరావాలని కోరారు. రక్తదాతలు నిజమైన ప్రాణదాతలని…రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదన్నారు. రక్తదానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు. తలసేమియాతో బాధపడే చిన్నారుల ప్రాణాల్ని రక్షించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని చేపట్టామని పేర్కొన్నారు. సమాజ సేవలో టీఆర్ఎస్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, మధుయాదవ్, శరత్ గౌడ్, సంతోష్ గౌడ్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.