కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 14 : లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీషాబాబూరావులు అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ముందుగా ప్రగతినగర్లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రగతినగర్, ముష్కిపేట, చిత్తారమ్మనగర్, శ్రీహరినగర్, టి అంజయ్యనగర్, శివశక్తినగర్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలు, బస్తీలలో మహిళలు, యువకులు ఎమ్మెల్యేను కలుస్తూ స్థానిక సమస్యలను చెప్పడంతో పాటు కాలనీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మంగళహారతులతో స్వాగతాలు పలుకుతూ.. బొట్టుపెట్టి మీవెంటే మేముంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధిని సాధించిందని నగరంలో మెరుగైన వసతుల కారణంగా ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం.. కూకట్పల్లి నియోజకవర్గంలో వర్షంనీటి నాలా పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాలాజీనగర్ డివిజన్లోని ప్రగతినగర్, హబీబ్నగర్, శివశక్తినగర్ ప్రాంతాలలో వరదనీటి కాలువ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షంనీరు వస్తుందని ఈ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కార్యదర్శి వెంకటేశ్ చౌదరి, జీహెచ్ఎంసీ, జలమండలి, పలు విభాగాల అధికారులు, స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.