కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 1 : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటర్లను కోరారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులోని జీహెచ్ఎంసీ పార్కుతో పాటు పలు పార్కుల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు.
కాలనీలు, బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి అంతరాయం లేని విద్యుత్తో పాటు అవసరాలకు సరిపడా తాగునీటిని అందించినట్లు వివరించారు. వేలాది కోట్లతో చేసిన అభివృద్ధి పనులు కండ్ల ముందే కనబడుతున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కృష్ణారావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషాబాబూరావు, మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్: శామీర్పేట్కు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. స్థానిక సీఎంఆర్ ఫంక్షన్హాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. కాగా, రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టానున్నారు. ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ అందించాలని నేడు కలెక్టర్కు వినతి పత్రాలు అందజేయనున్నారు.