జీడిమెట్ల, మార్చి 19 : కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న ఐడీపీఎల్ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ.. వారికి అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం ఐడీపీఎల్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 150 కుటుంబాలు 40 సంవత్సరాలుగా ఐడీపీఎల్ కాలనీలోనే ఉంటున్నామని, ప్రస్తుతం ఆకస్మికంగా ఇండ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని బాధితులు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఇన్నాళ్లు ఐడీపీఎల్ టౌన్షిప్లో సబ్సిడీ అద్దెతో ఉండగలుగుతున్నామని, ఆకస్మికంగా ఇండ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తుండటంతో రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడీపీఎల్ టౌన్షిప్ భూమిలో కొంత భా గాన్ని తమకు కేటాయించేలా కృషి చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యేలను కోరారు.
అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఐడీపీఎల్ కాలనీవాసులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక్కొక్కటిగా అమ్మేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని అన్నారు. న్యాయబద్దంగా కార్మికులకు రావాల్సిన బకాయిలను సైతం ఇవ్వకుండా మొండి వైఖరి చూపడం బాధాకరమన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఐడీపీఎల్ యాజమాన్యంతో చర్చిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొడ్డు వెంకటేశ్వర్ రావు, కె.ఎం. గౌరీశ్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్, సంజయ్పురి కాలనీలో నూతనంగా నిర్మించిన కమాన్ (ముఖద్వారం)ను ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్లు వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భం గా కాలనీవాసులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నవోదయ సంక్షేమ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్, లాల్సాబ్గూడలోని కొట్టగుట్ట పెద్దమ్మ తల్లివద్ద జరిగిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలు ప్రజలపై తప్పక ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.