కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 6 : వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకొనేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కూకట్పల్లి రంగధాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై వినాయక నిమజ్జన ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్, రెవెన్యూ, జలమండలి, అగ్నిమాపక, ఇరిగేషన్ శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. నగరంలో ట్యాంక్బండ్ తర్వాత అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే ఐడీఎల్ చెరువుగట్టుపై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లను బాగు చేయాలని, చెరువుగట్టుపై భారీ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ దీపాలను అందుబాటులోకి తేవాలన్నారు. మూడోరోజునుంచే వినాయక విగ్రహాల నిమజ్జననాలు మొదలవుతాయని ఈ నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు.
చెరువుల్లో వేసిన విగ్రహాలను వెంటనే తొలగించాలని.. మూడు అడుగుల లోపు చిన్న విగ్రహాలను కొలనుల్లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుగట్టుపై పూజా సామగ్రితో కూడిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
నిమజ్జన వేడుకల సందర్భంగా రాజకీయ పార్టీల బ్యానర్లు కట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాలు జరిగే చెరువుగట్టు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
అత్యవసర వైద్య సేవలందించేందుకు ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని.. జలమండలి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల్లో ఎలాంటి గొడవలు జరుగకుండా శాంతిభద్రతల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. నియోజకవర్గం పరిధిలోని ప్రధాన చెరువులు, కొలనులను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకొనేలా బాధ్యత తీసుకోవాలని అధికారులను కోరారు.