కేపీహెచ్బీ కాలనీ (హైదరాబాద్) : దళితుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Madhavaram Krishna Rao ) అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్లో నిర్వహించిన దళితబంధు (Dalit Bandu) పథకంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్( CM KCR ) దేనని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అందుతున్నాయని తెలిపారు. సమాజంలో వెనుకబడిన దళితుల అభ్యున్నతి కోసం గత పాలకులు చేసిందేమీ లేదని వివరించారు. లబ్దిదారులుఎంచుకున్న వ్యాపారానికి సంబంధించి పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు. దళితబంధు ఇప్పిస్తానని దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని కోరారు.
దళితబంధు పేరిట బీఆర్ఎస్ (BRS) నేతలతో పాటు ఎవరైనా డబ్బుల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించినట్లు తెలిపారు. మాయమాటలతో ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో..? ఏమీ పనులు చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు స్వార్థంతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ, సబీహా గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్కుమార్, పగుడాల బాబూరావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.