కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 1 : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీల నేతలు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని(Ragidi Lakshmareddy) ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) కోరారు. సోమవారం పార్ల మెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులోని జీహెచ్ఎంసీ పార్కుతో పాటు పలు పార్కులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని.. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కాలనీలు, బస్తీలలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి అంతరాయం లేని విద్యుత్ అవసరాలకు సరిపడా తాగునీటిని అందించామన్నారు. వేలాది కోట్లతో చేసిన అభివృద్ధి పనులు కండ్లముందే కనబడుతున్నాయని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను ఆదరించడం వల్లే భారీ మెజార్టీతో విజయం సాధించామన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీని అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబూరావు, మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బాబూరావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.