దుండిగల్, జూన్ 23 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధిలో అగ్రగామిగా రూపొందిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ. 2కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 18డివిజన్ పరిధిలోని బొల్లారం జంక్షన్ నుంచి కల్వర్టు వరకు రూ. 50లక్షలు, 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రూ. 10లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అదే విధంగా 20వ డివిజన్ జయదీపిక కాలనీలో రూ. 45లక్షలతో నాలా స్లాబుల నిర్మాణం, 32వ డివిజన్ రాజీవ్గృహకల్పలో రూ. 12.50 లక్షలతో చేపట్టనున్న పార్కు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, 31,32,33 డివిజన్ల పరిధి, రాజీవ్గృహకల్ప సముదాయం సమీపంలో రూ. 78లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గం పరిధిలో కోట్లాది నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్లోను మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి నిజాంపేట కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
అంతకు ముందు బాచుపల్లిలోని బ్లాక్డైమండ్ వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా రూ. 4.50లక్షలతో మల్టీలేయర్ అవెన్యూ ఫ్లాంటేషన్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపీ, డిఫ్యూటీ మేయర్ ధన్రాజు, టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి,కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.