దుండిగల్, నవంబర్ 24 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్గౌడ్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా జీడిమెట్ల డివిజన్లోని స్పింగ్ఫీల్డ్ కాలనీలో, గాజులరామారం డివిజన్ పరిధిలో కార్పొరేటర్ రావులశేషగిరిరావుతో, చింతల్ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్య్ర భారతంలో 75ఏండ్ల కాలంలో జాతీయ పార్టీలు చేయలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధే ఇందుకు సాక్ష్యమన్నారు. ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే రూ.6వేల కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో కుత్బుల్లాపూర్ ఎట్లుండే…? ఇప్పుడు ఎట్లుంది..? అనే అంశాలను ప్రజలు బేరీజు వేసుకొని ఓటు వేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరుగాలన్నా.., సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటువేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు విని మీ విలువైన ఓటును వృథాచేయవద్దని తెలిపారు. వివేకానంద్ ప్రచారానికి విశేషస్పందన లభించింది. అడుగడుగునా మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంతరావు, దూదిమెట్ల సోమేశ్యాదవ్, మహ్మద్ మక్సూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.