ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
కాచిగూడలో దళితబంధు యూనిట్ ప్రారంభం
అంబర్పేట, జూన్ 25: దళితులు కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాష్ట్రంలోని దళితుల అభ్యన్నతికి పాటుపడటమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. కాచిగూడ డివిజన్కు చెందిన దళితబంధు లబ్ధిదారుడు కె.సదానంద్ స్థానికంగా బోటిక్ వస్ర్తాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సముదాయాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శనివారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. దళితుల కుటుంబాల్లో సంతోషం నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా దళితుల కోసం ఇలాంటి పథకాన్ని తీసుకురాలేదని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా దళితబంధును సీఎం తీసుకువచ్చారన్నారు.
దళితులను కూడా వ్యాపారవేత్తలుగా చూడాలనే కోరిక సీఎం కేసీఆర్కు ఉందన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో ఇప్పటికే వంద మంది దళితులు ఈ పథకం కింద ఎంపికయ్యారని, ఇందులో 25 మందికి అధికారులు యూనిట్లు కూడా అందజేశారని పేర్కొన్నారు. మిగతా వారి ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే వారికి కూడా యూనిట్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కొత్తగా ఇంకా 1500 మందికి దళితబంధు అందనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భీష్మాదేవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
గోల్నాక, జూన్ 25: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జలమండలి జీఎం శ్రీధర్రెడ్డితో పాటు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న మంచినీటి, డ్రైనీజే పైపులైన్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దీంతో అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలో కొత్తగా ప్రతిపాదించిన పనుల నిర్మాణానికి అనుమతులు లభించిన వెంటనే అంచనా వ్యయాన్ని సిద్ధం చేసి ఆలస్యం చేయకుండా బిల్లులు పంపించి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జలమండలి అధికారులు విష్ణువర్ధన్రావు, సన్యాసిరావు, భావన, కుశాల్, రోహిత్, షఖీర్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.