హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో(Hyderabad) దోమలను అరికట్టండి, నగర వాసులను కాపాడండని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమల బెడదకు(Mosquito problem) నిరసనగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్లో ఫాగింగ్ మిషన్, దోమ తెరలతో ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమతి లేదని మార్షల్స్ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. బలవంతంగా ఫాగింగ్ మిషన్ ,దోమతెరలను లాక్కెళ్లారు. సుధీర్ రెడ్డిదోమ తెర ధరించి ప్రెస్ మీట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దోమలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భయంతో ప్రజలు పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.