సైదాబాద్, సెప్టెంబర్ 13 : బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటుందన్నారు. సోమవారం సింగరేణి కాలనీకి విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి ఘటన జరుగడం బాధకారమని, తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
సింగరేణికాలనీలోని బాధిత కుటుంబాన్ని విపక్ష నేతలు కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బెల్లయ్య నాయక్, ఇందిరా శోభన్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్పాషా, సీపీఐ నాయకులు ఈటీ నర్సింహ, శంకర్ నాయక్, బీఎస్పీ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్, సీపీఎం, సీపీఐలకు చెందిన నాయకులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటుగా నిలుస్తున్నాయని, గతంలో లైంగిక దాడులకు పాల్పడి హత్య చేసిన ఘటనల్లో నిందితులకు విధించిన శిక్షను అమలు చేయాలన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చంపాపేట ప్రధాన రహదారిపై వివిధ పార్టీలకు చెందిన నేతలు రిలే నిరాహార దీక్షను సోమవారం కొనసాగించారు. సీపీఎం నాయకులు ఎం. బాలునాయక్, సీఐటీయూ నాయకులు శ్రవణ్కుమార్ మీనా, బీజేపీ నాయకులు జంగం మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కాలనీ ఘటన నిందితుడి బహిరంగంగా ఉరితీయాలని, లేక ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరారు. వివిధ పార్టీ నాయకులు, ప్రజా సం ఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించి, చిన్నారి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడిచేసిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సాయంత్రం బాలల హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ కన్వీనర్ కృష్ణ, లక్ష్మీనారాయణ, సైదాబాద్ మండల కన్వీనర్ షేక్ మహమూద్ సైదాబాద్ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారిని హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని తెలిపారు.