ఎల్బీనగర్: మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చాలంటే తమను దాటి వెళ్లాలని, ప్రజలకు అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని జనప్రియ అపార్టమెంట్ సముదాయంలో, చైతన్యపురి డివిజన్ సత్యనగర్ కాలనీలో నిర్వహించిన సమావేశాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరీవాహకంలోని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తాను ఎల్లవేళలా అందుబాటులోని ఉంటానని, ప్రజలకు ఎలాంటి హానీ జరుగనివ్వబోమన్నారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు మూసీ నీరు తాగేవారని, అంత స్వచ్ఛంగా నీరు ఉండేదన్నారు. మూసీ నది రానురాను మురికికూపంగా మారిందని, తాను ఎంఆర్డీసీ చైర్మన్గా ఉన్న సమయంలోనే మూసీ ప్రక్షాళన ప్రారంభించానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేసేందుకు 32 ఎస్టీపీలను ప్రారంభించామని, వాటిలో కొన్ని పూర్తయినట్లు పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడతామంటే, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే తాము ఒప్పుకోమని సుధీర్రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.