బంజారాహిల్స్,అక్టోబర్ 27: రైతుబంధు పథకంతో పాటు పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రైతుబంధును ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖలు రాయడంతో పాటు రైతుబంధు పేరిట డబ్బులు దుబారా చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నుంచి బయటపడేయడంతో పాటు వారికి అండగా నిలబడటం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేసి సాగుకు నీరందించడంతో ఇప్పుడిప్పుడే రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3గంటలు ఉచిత విద్యుత్ సరిపోతుందని వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు. కర్నాటక రాష్ట్రంలో రైతులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, గృహలక్ష్మి తదితర పథకాలన్నింటినీ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు. పేదల ఆగ్రహానికి కాంగ్రెస్ బూడిద కావడం ఖాయమని, రానున్న ఎన్నికలు రేవంత్రెడ్డికి చివరి ఎన్నికలు అవుతాయన్నారు.
మియాపూర్ , అక్టోబర్ 27 : ఏండ్ల తరబడి పాలించిన కాంగ్రెస్కు రైతుల గోస ఏనాడూ పట్టలేదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సాగు నిమిత్తం రైతన్నకు రైతుబంధు పథకం ద్వారా సాయం అందిస్తున్న నిజమైన రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిస్తే….ఆ పథకమే అనవసరమంటూ కాంగ్రెస్ నేతలు రాబంధుల్లా తయారయ్యారన్నారు. శుక్రవారం విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ… రైతుబంధు పథకం పై కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తొలి నుంచి కాంగ్రెస్కు రైతులంటే గిట్టదని..అందుకే రైతులకు పూర్తిగా అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం దుబారా ఖర్చని, పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ను అందిస్తూ సాగును పండుగ చేసిందన్నారు. రైతు విరోధిగా నిరూపించుకున్న ఇలాంటి పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు తప్పక చెబుతారన్నారు. కపట కాంగ్రెస్కు ఎన్నికల్లో కరెంట్ షాక్ తప్పదని విప్ గాంధీ స్పష్టం చేశారు.