బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : బంజారాహిల్స్ రోడ్డు నంబరు-3లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంతకాలం కింద నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. దాని పక్కనే సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ఇంతకాలం దాని జోలికిపోని దానం నాగేందర్.. గత నెలలో దాదాపు 700 చదరపు గజాల వరకు మలుపుకొని రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. ఈ విషయం పై ఫిర్యాదు అందిన వెంటనే షేక్పేట రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ప్రహరీ రేకులపై ఇది ప్రభుత్వ భూమి అని రాయడంతో పాటు సర్కారు స్థలమని బోర్డు కూడా పాతారు.
గత నెల 17న సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండు, మూడు రోజుల తర్వాత అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంది తడవు… బోర్డు పై రాసిన సర్కారు స్థలమనే రాత మాయమైంది. రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలూ లేవు. సామాన్యుడు సర్కారు స్థలాన్ని సెంటు మలుపుకుంటే ముందు కూల్చివేసి ఆపై పోలీసు కేసులంటూ హడావిడి చేసే అధికార యంత్రాంగం ఇప్పుడు మౌనరాగం ఆలపిస్తున్నది.
ఇంతకీ… దానం మలుపుకున్న భూమి విలువ ఎంతో తెలుసా?! కనీసం రూ.20 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ భూ ఆక్రమణపై షేక్పేట మండల తహసీల్దార్ అనితారెడ్డిని వివరణ కోరగా..ఎమ్మెల్యే నివాసం వెనకాల ప్రహరీ గోడ కట్టడంతో పాటు రేకులు ఏర్పాటు చేసినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ గోడలు తాత్కాలికమేనని, నిర్మాణ సామగ్రి ఉన్నందున వాటి రక్షణ కోసం కట్టారని, పనులు పూర్తయిన తర్వాత గోడలు తొలగిస్తామని ఎమ్మెల్యే దానం సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వాటిని తొలగించలేదని పేర్కొన్నారు.