బంజారాహిల్స్,మే13: ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లోని ఉన్న అభివృద్ధ్ది పనులన్నింటినీ రానున్న పదిహేను రోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీతో పాటు జలమండలి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దానం అధ్యక్షతన శనివారం బంజారాహిల్స్ రోడ్ నం 10లోని గౌరీశంకర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఎంసీ రజినీకాంత్రెడ్డి, ఈఈ విజయ్కుమార్. జలమండలి జీఎం హరిశంకర్తో పాటు కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి. వెల్దండ వెంకటేశ్, వనం సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో డివిజన్వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలను గురించి అధికారులు వివరించారు. బస్తీలు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తమ బస్తీల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
హిమాయత్నగర్ డివిజన్ ట్రాన్స్ఫార్మర్లకు సరైన రక్షణ ఏర్పా ట్లు లేవని, వర్షాకాలంలో ప్రమాదం పొంచి ఉందంటూ స్థానిక సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సిల్ట్ను రోజుల తరబడి తొలగించడంలేదని ఫిర్యాదులు చేశారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట మార్కెట్ వద్దనుంచి మోడల్ హౌజ్ దాకా మురుగు సమస్యలు తీవ్రంగా ఉందని, పంజాగుట్ట కుమ్మరి బస్తీలో డ్రైనేజీ లైన్ నిర్మించాలని స్థానిక బస్తీనేతలు కోరారు. దుర్గానగర్, వెంకటరమణ కాలనీ, ఆనంద్నగర్ కాలనీలో కొన్ని చోట్ల వీధిదీపాలు వెలగడం లేదని,రాజ్నగర్లో వర్షాలు కురిసినప్పుడు వరద సమస్యలు తీవ్రంగా ఉందని ఫిర్యాదులు చేశారు.
వరదనీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన మోటార్స్ పనిచేయడంలేదని వారు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఇందిరానగర్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉందని, వర్షాలు వచ్చినప్పుడల్లా వరదనీరు మొత్తం రోడ్లపై ప్రహహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో సీసీ రోడ్డుపనులు ప్రారంభం కాలేదని, నాలాల్లో పూడికతీత సమస్యలు ఉన్నాయని కార్పొరేటర్ సంగీతాయాదవ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరకాలనీ మన్నె కవితారెడ్డి డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.
సమీక్షా సమావేశంలో వివిధ డివిజన్లకు సంబంధించిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను 15రోజుల్లో పరిష్కరించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సీరియస్గా ఉండాలని, ఆషామాషీగా తీసుకుంటే ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవనారు. చిన్నచిన్న సమస్యలను కూడా రోజుల తరబడి పరిష్కరించకపోతే ఎలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైన తర్వాత కూడా పనులు ప్రారంభం కావడం లేదంటే అధికారులనే బాధ్యులను చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 20వేలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, కొత్తగా 2వేల మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో అవసరమైన చోట్ల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని, రేషన్ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చారు.
బంజారాహిల్స్,మే 13: పేదలకు ఉపయోగపడేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలింనగర్లోని గౌతమ్నగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్కు చెందిన పలు బస్తీల్లో జీవో 58 కింద మంజూరైన 38 పట్టాలను ఎమ్మెల్యే దానం శనివారం లబ్ధ్దిదారులకు అందజేశారు. అదే విధంగా 7 షాదీ ముబారక్ చెక్కులు, 15 కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే దానం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడు తూ.. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న వారికి యాజమాన్యహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం జీవో 58, 59 జారీ చేసిందన్నారు. దళితబంధు, గృహలక్ష్మి పథకాల కింద త్వరలో లబ్ధ్దిదారుల ఎంపిక జరుగుతుందని దళారులను నమ్మి ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్, నగేశ్సాగర్, అబ్దుల్ ఘనీ,దీపాదేవి,రాములమ్మ, పద్మ, కృష్ణ, నక్కారాము, కోటేశ్వరమ్మ, సుగుణమ్మ, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు.