మేడ్చల్, ఫిబ్రవరి 7 : మాయమాటలతో ప్రజలను మోసం చేసి, దౌర్జన్యాలకు దిగుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ది చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కొల్తూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పని చేసి ఓట్లు అడుగుతున్నామన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఇంటింటికీ నీళ్లు, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, రైతుబంధు ఇచ్చారని చెప్పారు.
కాంగ్రెసోళ్లది పచ్చి మోసం అని దుయ్యబట్టారు. రూ.4వేల పింఛన్ ఇస్తామని ఇవ్వలేదని, మహిళలకు రూ.2500, కాలేజీకి వెళ్లే ఆడ పిల్లలకు స్కూటీలు ఇస్తామని ఇయ్యలేదని, తులం బంగారం మాటే లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే పింఛన్ రూ.3వేలు అయ్యేదన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టాన్ని దివాళ తీయించిందన్నారు. శుక్రవారం లాల్గడీ మలక్పేటలో కాంగ్రెస్ నాయకులు మెడ పట్టుకొని బీఆర్ఎస్ నాయకుడిని చంపే ప్రయత్నం చేశారన్నారు.
ఇక కాంగ్రెస్ను నమ్మెద్దని, మళ్లీ ఈ జన్మలో ఎన్నికలంటే భయపడేలా ఓటుతో గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞపి చేశారు. కాంగ్రెస్ పైసలతో గెలవాలని ప్రయత్నం చేస్తుందని, పైసలు తీసుకొని, పని చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి గజ్జెల నాగేశ్, యువ నాయకుడు డాక్టర్ భద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లేశ్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, అభ్యర్థులు శశిరేఖ, గుండ్లపల్లి మహేశ్వరి, గిరిపల్లి జ్యోతి, గిరిపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.