మియాపూర్, ఫిబ్రవరి 11: పెరగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోను పొడిగించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. శనివారం శాసనసభ సమావేశాల్లో భాగంగా మెట్రో రైలు విస్తరణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్లు విస్తరించేందుకు తన నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విప్ గాంధీ విన్నపంపై స్పందించిన మంత్రి కేటీఆర్ రెండో దశలో ఈ మెట్రో మార్గాన్ని తీసుకుంటామని వివరించారు.