హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కి చెందిన ఇందు.. దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నది. రోజూలానే గురువారం ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థిని సాయంత్రం పొద్దుపోయినా ఇంటికి తిరిగిచేరుకోలేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు.. దమ్మాయిగూడ చెరువులో ఆమె మృతదేహం లభించింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెరువు వద్దకు ఎలా వెళ్లింది, ఎవరైనా తీసుకెళ్లారా అనే అంశంపై ఆరాతీస్తున్నారు.