హైదరాబాద్, మే 25: క్షీపణిలకు సంబంధించి కీలక విడిభాగాలు తయారు చేసే హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.98.60 కోట్ల ఆదాయంపై రూ.19.8 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంతో పోలిస్తే 26.2 శాతం అధికమవగా, అలాగే నికర లాభంలో 48.8 శాతం ఎగబాకింది.
2021-22 ఏడాదికిగాను రూ.322 కోట్ల ఆదాయంపై రూ.61 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఎగుమతుల ద్వారా సంస్థకు రూ.197.80 కోట్ల ఆదాయం సమకూరగా, దేశీయంగా రూ.124.20 కోట్లు లభించినట్లు కంపెనీ ఎండీ, ప్రమోటర్ పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు, డిఫెన్స్అండ్ స్పేస్ రంగాల్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటునకు కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.648.80 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. ప్రొడక్ట్ పరిధిని మరింత విస్తరించడంతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు, ఇందుకు సంబంధించి పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.