బంజారాహిల్స్, సెప్టెంబర్ 22: రోడ్డుపై వెళ్తున్న యువకుడిని అటకాయించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ కర్రలతో దాడికి పాల్పడిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్నగర్లో నివాసం ఉంటున్న నగేశ్ (30) కొత్త చెరువు సమీపంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపిస్తుంటాడు. బుధవారం రాత్రి 12గంటల ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ను మూసేసిన నగేశ్ తన బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే నలుగురు యువకులు నగేశ్ను అడ్డుకున్నారు.
డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నగేశ్ డబ్బులు ఇవ్వకపోవడంతో దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడకు చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బందిని చూసి ముగ్గురు నిందితులు పారిపోయి పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్కు తరలించారు. పెట్రోలింగ్ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోగానే పొదల్లో దాక్కున్న ముగ్గురు నిందితులు బయటకు వచ్చి ‘మా మీద ఫిర్యాదు చేస్తావా..’ అంటూ కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో నగేశ్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నగేశ్ను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులంతా సమీపంలోని పొదల్లోనే కూర్చొని గంజాయి. మద్యం సేవిస్తుంటారని, దారినపోయే వారిని బెదిరించి డబ్బులు లాక్కుంటారని స్థానికులు తెలిపారు.