హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మైనార్టీ గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సనత్ నగర్ బాయ్స్ 1 స్కూల్లో 100 శాతం ఫలితాలు సాధించారు. జీ రోహిత్కు 9.8, షేక్ అమీర్ అబ్దుల్లా 9.7, ఎండీ అస్మైర్ 9.5 గ్రేడ్స్ సాధించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సల్మా ఖుతేజా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో 93.73 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రతి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొన్న ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు.. నేడు టెన్త్ ఫలితాల్లోనూ విజయభేరి మోగించారు. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే సాధ్యమయ్యాయి. రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే.