మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్హల్లో బుధవారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి సబితారెడ్డి షాదీముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కులతో పాటు మహిళలకు కుట్టుమిషన్లు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారుడు.
పహాడీషరీఫ్, సెప్టెంబర్ 20: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దన్నగా, మేనమామగా అండగా ఉంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కుట్టుమిషన్లు, దివ్యాంగులకు అండగా ఉంటూ బ్యాటరీ వాహనాలను అందజేస్తున్నారని తెలిపారు. పహాడీషరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్హాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన మంత్రులు.. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, బాలాపూర్ మండల తహసీల్దార్ మాధవితో కలిసి 313 మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, 180 మంది మహిళలకు కుట్టుమిషన్లు, 80 మంది దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. వందకోట్లతో జల్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హోంమంత్రి మహమూద్ అలీ, మహేశ్వరంలో డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు చేశారన్నారు. ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్కు మంత్రి మహమూద్ అలీ సన్నిహితంగా ఉంటూ ఎంత ఎదిగినా ఒదిగి.. సామాన్యులుగా అందిరితో కలిసిపోయి ఉంటున్నారన్నారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా దేశంలోనే నంబర్ వన్గా నిలిపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ, ముస్లిం సోదరులుగా కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. దేశంలో కేసీఆర్ను మించిన నేతలు లేరన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, షేక్ అఫ్జల్, హమీద్, కొండల్ యాదవ్, ఇస్కమూరి నిరంజన్, అర్కల కామేశ్రెడ్డి, శివశంకర్ ముదిరాజ్, గజ్జెల అనిల్ కుమార్, మాజీ వక్ఫ్బోర్డు చైర్మన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.