ముషీరాబాద్, జూలై 17 : బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భవిష్యవాణి, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువత కేరింతల నడుమ ఫలహార బండ్ల ఊరేగింపు కనువిందుగా సాగాయి. అడిక్మెట్ డివిజన్లోని రాంనగర్ నల్లపోచమ్మ దేవాలయం, అడిక్మెట్ వడ్డెర బస్తీలోని పోచమ్మ-ముత్యాలమ్మ, విద్యానగర్లోని బంగారు ముత్యాలమ్మ, ముషీరాబాద్ మహంకాళి దేవాలయాల్లో రంగం(భవిష్యవాణి), ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా జరిగాయి. రాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రేశం మల్లేశ్ ఆధ్వర్యంలో మేదరబస్తీలో జరిగిన ఫలహార బండి ఊరేంగింపు కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్లు సుప్రియా నవీన్ గౌడ్, రవిచారి, సునీతాగౌడ్, పావని, రచనశ్రీలు, మాజీ కార్పొరేటర్లు వి.శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నగర నాయకులు ఎంఎన్ శ్రీనివాసరావు, ముఠా జయసింహ తదితరులు పాల్గొని పూజలు చేశారు.
కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో..
కవాడిగూడ, జూలై 17: బోనాల పండుగ సందర్భంగా కవాడిగూడ డివిజన్ టోయర్ ట్యంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పింగళి వెంకట్రామ్రెడ్డి హాల్ నుంచి చేపట్టిన ఘటం ఊరేగింపును ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్కుమార్ పటేల్ ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రవేశం, అమ్మవారికి మహా నివేదన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 3 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి హుస్సేన్ సాగర్లో గంగతెప్పోత్సవంలో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు గావు కళ్యాణం, 7 గంటలకు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోతురాజుల నృత్యాలు, బద్దిపాలు, వరద గావు, తదితర పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాత్విక్ శర్మ, రాజేశ్వర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ పాల్గొన్నారు. రంగం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో…
ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఎయిర్టెల్ రాజ్, ఆలయ కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి సమక్షంలో బోనాల సందర్భంగా రంగం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మొదలైన అభిషేకాలు, అర్చనలు, గుమ్మడికాయ ఎదుర్కోలు, పచ్చికుండ తేవడానికి బయలు దేరుట, రంగం(భవిష్యవాణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 గంటలకు గావు కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు ఘటం వీడ్కోలు, బలిగంప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గంటల రాజు, సందుపట్ల కమలాకర్ రెడ్డి, పూస గోరఖ్నాథ్, బల్లా రూపశ్రీ, కొరివి సహజానంద్ ముదిరాజ్, రామకృష్ణ యాదవ్, ఆలయ ప్రధాన పూజారి వై. చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలను చల్లగా చూసే బాధ్యత నాదే…
బోనాల ఉత్సవాల్లో భాగంగా కవాడిగూడలోని కనకాల కట్టమైసమ్మ దేవాలయం, ముషీరాబాద్లోని మహంకాళీ దేవాలయంలో సోమవారం ముక్కోటి దేవతలను తలుస్తూ స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని, ప్రజలను కాపాడి చల్లగా చూసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రజలు రోగాల భారిన పడకుండా చూస్తానని, ఐదు వారాల పాటు తనకు సాకపోయాలని సూచించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.