హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మైండ్స్పేస్ జంక్షన్, రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ గ్రౌండ్ ప్రాంతాల్లో పర్యటించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. శంకుస్థాపన చేయనున్న మైండ్ స్పేస్ జంక్షన్ లో శిలాఫలకం పైలాన్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం, ట్రాపిక్ మళ్లింపు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించే పోలీసు గ్రౌండ్స్లో సభా వేదిక ఏర్పాటు, సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రూ.6,250 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు సీఎం కేసీఆర్ మైండ్ స్పేస్ జంక్షన్లో శంకుస్థాపన చేసిన అనంతరం పోలీసు గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఇది ఎంతో గొప్ప ఈ ప్రాజెక్టు అని, రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రైలు లైన్ నిర్మాణంలో బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎయిర్ పోర్ట్ కార్గో స్టేషన్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంతో అనేకమందికి ఉపయోగకరంగా ఉంటుందని, విమాన ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్ స్పేస్, హై టెక్ సిటీకి కేవలం 20 నిమిషాలలో చేరుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనే ఆలోచన, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో రూ.వందల కోట్ల ఖర్చుతో నూతనంగా అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి దశలో 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో రైలు సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
మూడు కారిడార్లో కలిపి 63 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు ౩౦ కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారని అన్నారు. రెండో దశ తో కలుపుకొని మొత్తం 94 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. మంత్రుల వెంట ఎంపీ రంజిత్రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికె పూడి గాంధీ, కాలే యాదయ్య, కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.