అబిడ్స్, మే 29 : విద్యార్థుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం గోషామహల్ నియోజకవర్గం పరిధి బొగ్గులకుంటలోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజిలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత గౌరవం, తృప్తి కలుగుతుందని అన్నారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్న అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను మంత్రి ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 1.35లక్షల ఉద్యోగాల భర్తీ జరుగగా, మరో 90వేల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అభివృద్ధి పనుల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉండటం, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, లక్షలాది మందికి వాటిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
అనంతరం జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని మధు, లోహిత్కుమార్, అపోలో హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేందర్రెడ్డి, మెథడిస్ట్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రభు, కళాశాల డైరెక్టర్ రాకేశ్ రెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు సూర్యచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.