బన్సీలాల్పేట్, జూన్ 4 : నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రహదారులన్నింటిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచానెహ్రూనగర్లో రూ.96.80 లక్షలతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులను, బన్సీలాల్పేట్లోని డీ-క్లాస్లో రూ.71 లక్షల వ్యయంతో ఏర్పాటు ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ హేమలత లక్ష్మిపతితో కలసి ప్రారంభించారు. బస్తీలో తిరిగి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తమ బస్తీలో డ్రైనేజీ, తాగునీరు పైప్లైన్లు శిథిలావస్థకు చేరాయని పలువురు ఫిర్యాదు చేశారు. నూతన పైప్లైన్ల ఏర్పాటుకు నిధులను మంజూరు చేశానని, త్వరలో వాటిని ఏర్పాటు చేశాకే నూతన రోడ్డు పనులను మొదలు పెడతామని మంత్రి వారితో అన్నారు. డీ-క్లాస్ లోని కమ్యూనిటీ హాలుపై ప్రజల వినియోగానికి అదనపు అంతస్తును నిర్మిస్తామని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ వాసులకు తాగునీటి సమస్యలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీలో మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును త్వరలో చేపడతామని అన్నారు.
బండమైసమ్మనగర్కు వెళ్లే ప్రధాన రహదారి వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత నిధులతో నిర్మించిన బండమైసమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. కార్పొరేటర్ హేమలత, బీఅర్ఎస్ డివిజన్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్రాజు, లక్ష్మిపతి పాల్గొన్నారు.
అమీర్పేట్, జూన్ 4 : ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి లోధా అపార్ట్మెంట్ పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. ఆదివారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, టౌన్ప్లానింగ్ ఏసీపీ రమేశ్, బయో డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ సుధీర్లతో కలిసి మంత్రి ఆదివారం ఉదయం లోధా పరిసరాలు, బస్టాండ్ చౌరస్తాలను సందర్శించారు.
ఈ సందర్భంగా లోధా అపార్ట్మెంట్ నివాసితులు తమ అపార్ట్మెంట్ ఎదురుగా చోటు చేసుకున్న ఫుట్పాత్ ఆక్రమణలు పూర్తి తొలగించి పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు వీలైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి తలసాని సనత్నగర్ ప్రధాన రహదారిని 100 ఫీట్ల మేరకు విస్తరించి అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పరిసరాలను సంబంధిత అధికారులతో చర్చించి ఆ స్థలాన్ని రోడ్డు విస్తరణకు మంజూరు చేసేలా చర్యలు చేపట్టి విస్తరణ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఫ్లై ఓవర్ కింద ఉంటున్న వారు విస్తరణ పనులకు ఇస్తున్న తమ ఆస్తులకు సంబంధించి నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నామని తెలిపారు. లోధా అపార్ట్మెంట్ ప్రతినిధులు వేణుగోపాల్తో పాటు స్థానిక నివాసితులు పాల్గొన్నారు.