Balkampeta Temple | హైదరాబాద్ : జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అద్భుత పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.