సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్హాల్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జీవో 58 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పట్టాలను వారం రోజుల్లోగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్కు సూచించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఆసరా పెన్షన్ కింద హైదరాబాద్ జిల్లా పరిధిలో 2.76లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.67కోట్ల రూపాయలను పెన్షన్గా అందజేస్తున్నట్లు తెలిపారు. 57 ఏండ్లు దాటిన వారికి కూడా పెన్షన్ను అందజేస్తున్నామని, పెన్షన్కు అర్హులైన లబ్ధిదారులందరికీ గుర్తింపు కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు దరఖాస్తులో పేర్కొన్న అడ్రస్లలో ప్రస్తుతం ఉండడంలేదని అధికారులు పేర్కొనగా, అవసరమైతే ఆయా నియోజకవర్గాల
పెన్షన్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల వివరాలను అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరకు కృషిచేస్తానని మంత్రి పేర్కొన్నారు. దళితబంధు యూనిట్ల అమలుతీరును ఎస్సీ కార్పోరేషన్ అధికారులు పర్యవేక్షించాలని, స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల వివరాలు, యూనిట్ల సమాచారంతో కూడిన వీడియో, ఫొటోలతో కూడిన నివేదికలను సిద్ధం చేసి ఎమ్మెల్యేలకు అందజేయాలన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు గృహ లక్ష్మి అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తున్నదని పేర్కొన్నారు. త్వరలోనే పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయన్నారు. సమీక్షలో డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బలాల, ముంతాజ్ అహ్మద్ఖాన్, కలెక్టర్ అమయ్ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్డీవోలు వసంత, వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ పాల్గొన్నారు.