హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహముద్ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా బోనాల ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోందన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గతంలో కంటే అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. 18న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు.