Hyderabad | హైదరాబాద్ : బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన వర్షితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఈ నెల 13, 14 తేదీల్లో షేక్పేటలో యూత్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బన్సీలాల్పేటకు చెందిన వర్షిత పాల్గొని బంగారు పతకం సాధించారు. ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వచ్చే నెలలో నిర్వహించే జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు కూడా వర్షిత ఎంపికైంది.
ఈ సందర్భంగా వర్షిత, తన తల్లి సుచిత్ర, కోచ్ మనోజ్ రెడ్డిలతో కలిసి వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను బుధవారం ఉదయం కలిశారు. తాను సాధించిన గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ను మంత్రికి చూపించింది వర్షిత.
జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని వర్షితను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆశీర్వదించారు. వర్షితకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.