హైదరాబాద్ : ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో కృష్ణంరాజు పార్థివదేహానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో ప్రభాస్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించి అనేకమంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. 55 సంవత్సరాల తన సినీ రాజకీయ ప్రస్థానంలో 180కి పైగా చిత్రాలలో నటించారని తెలిపారు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రంలో కూడా నటించారని అన్నారు. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రభాస్ గొప్ప నటుడిగా రాణించడం పట్ల కృష్ణంరాజు ఎప్పుడు ఎంతో గర్వంగా ఫీలయ్యే వారని చెప్పారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తలసాని తెలిపారు.