సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని, నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మేళనాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని వివరించారు. ఆత్మీయ సమ్మేళనంలో 2014 కంటే ముందు, తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూలంకషంగా చర్చ జరుగుతుందని తలసాని తెలిపారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో డివిజన్ల వారీగా సమ్మేళనాలు జరుగుతున్నాయని, మిగిలిన డివిజన్లలో ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరావాలి
సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల ఎత్తైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని చెప్పారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయా నియోజవకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలనిసూచించారు. అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు.
అద్భుతంగా సమావేశాలు:దాసోజు శ్రవణ్
నగరంలో అద్భుతమైన రీతిలో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని పార్టీ జిల్లా ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. డివిజన్లలో వెయ్యి మందికి తగ్గకుండా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వస్తున్నారని, ఎన్నికలకు మేం సిద్ధమంటూ కార్యకర్తలు జోష్లో కనబడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకువెళ్తుందని, తద్వారా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు భారీ ఎత్తున తరలిరావాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.