హైదరాబాద్: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని సూచించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు.
నగర ప్రజలు వర్షాల వల్ల తలెత్తే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఈవీడీఎం కంట్రోల్ రూమ్ 9000113667కు ఫోన్ చేయాలన్నారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్లనుంచి బయటకు రావాలన్నారు.