Minister Srinivas Yadav | ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం నగరంలో కొత్తగా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ వంతెనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, వీఎస్టీ జంక్షన్లలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ నిరంతరం స్తంభించి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడేవారన్నారు. ఈ కష్టాలను దూరం చేసేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఈ వంతెన శనివారం నుంచి ప్రజలకు వినియోగంలోకి వస్తుందని, ప్రారంభోత్సవంతో వాహనదారుల సమస్యలు గట్టెక్కనున్నాయన్నారు. వంతెనకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును పెట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. నాయిని మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కార్మికులకు ఎంతో సేవ చేశారని, ఆయన సేవలకు గౌరంగా వంతెనకు పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు.
త్వరలోనే మూసీ నది అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూసీ నది వెంట ఇండ్లను నిర్మించుకొని నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సుమారు 10వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP) ద్వారా నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. ఇదే కాకుండా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, సీఆర్ఎంపీ కార్యక్రమం కింద రోడ్ల నిర్మాణం, ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటే రూపాయి తేనోళ్లు, అధికారంలో ఉన్ననాడు ప్రజల బాగోగులను విస్మరించిన వారంతా నేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి నాలుగున్నరేళ్ల నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యం మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం నగరంలో లక్ష డబుల్ బెడ్రూంలు నిర్మిస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.9.50 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్తో ప్రజలకు జరిగిన మేలు శూన్యమన్నారు. నిర్మాణమైన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.