బేగంపేట్ ఫిబ్రవరి 8: జనావాసాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గోదాలములను తరలిస్తామని, దీంతో భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి మినిస్టర్రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగిన దక్కన్ భవనం కూల్చివేతలు, అలాగే బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాచ్బౌలి బస్తీలో పర్యటించి ఈ ప్రమాదంతో జరిగిన నష్టం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం వలన తమ ఇండ్లపై ఉన్న సింటెక్స్ ట్యాంక్లు కాలిపోయాయని, గోడలు నెర్రలు వచ్చిన విషయాలను బస్తీ వాసులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు మరమ్మతులు ప్రభుత్వ పరంగా చేపడుతామని ట్యాం క్లు కూడా కొత్తవి కొనుగోలు చేసి ఇస్తామని కాలనీ వాసులకు చెప్పారు. కాలనీలో పడిన భవన వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీవరేజీ లైన్ కూడా మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కూల్చివేతలు పూర్తవుతాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్థానికులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందుకు బస్తీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు నష్టం వాటిల్లకుండా ప్రమాద భవనం కూల్చివేసినట్టు వివరించారు. కూల్చివేత కోసం రూ. 41 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నివాసాల మధ్య గోదాంలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. గోదాలముల నిర్వాహకులు సరైన జాగ్రత్తలు పాటించని కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, డీసీ ముకుందరెడ్డి, తహసీల్దార్ శైలజా, ఈఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.