హైదరాబాద్ : మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్లో రూ.9.50కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం భవనం మొత్తం కలియదిరిగారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బేగంబజార్ ఫిష్ మార్కెట్లో సరైన సౌకర్యాలు, వసతులు లేక విక్రయదారులు, కొనుగోలు దారులు అనేక ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూ.9.50 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు, వసతులతో నూతన మార్కెట్ భవనాన్ని నిర్మిచిందన్నారు. 43 హోల్సేల్ స్టాల్స్, కోల్డ్ స్టోరేజీ, 90 రిటైల్ స్టాల్స్, 71 కటింగ్ స్టాల్స్, పది డ్రై ఫిష్ స్టాల్స్, ఒక క్యాంటీన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవనంలో లిఫ్ట్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. మార్కెట్లో వ్యాపారం చేసుకునే వారికి మాత్రమే స్టాల్స్ను కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్టాల్స్కు అర్హులైన వారి పేర్ల జాబితాను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో చేపలను విక్రయించుకోవడం వలన మత్స్యకారులు గిట్టుబాటు ధరను పొందే అవకాశం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్పల్లి, మల్లాపూర్లో చేపల మార్కెట్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.50కోట్ల వ్యయంతో హోల్సేల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. పేదప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఫిషరీస్ కమిషనర్ లచ్చిరాం భూక్య, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, సీఈ దేవానంద్, డీడీ దత్తు పాంత్, ఈఈ సురేష్, ఎస్టేట్ ఆఫీసర్ భాషా, టీఆర్ఎస్ నేతలు ప్రేమ్సింగ్, నందు బిలాల్ తదితరులు పాల్గొన్నారు.