అమీర్పేట్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతూ రాష్ర్టాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైద్యం, విద్యుత్, వ్యవసాయం, విద్య, శాంతి భద్రతలు ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని దేశం ఆసక్తిగా గమనిస్తున్నదని తెలిపారు. శుక్రవారం అమీర్పేట్ డివిజన్లోని ఎల్లమ్మ దేవాలయ పరిసరాలు, సుప్రభాత్నగర్, రేణుకానగర్, బీజేఆర్నగర్-1, శ్రీరామ్నగర్లలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో నమోదయ్యే అత్యధిక మెజార్టీల్లోని మొదటి అయిదు స్థానాల్లో తానూ ఉండాలని సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఆ మెజార్టీని సాధిస్తానని తెలిపారు. ఇటీవల చేపట్టిన వరదనీటి కాలువలు, డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణాలతో తమ సమస్యలు దాదాపుగా తగ్గిపోయాయంటూ బల్కంపేట శ్రీరామ్నగర్ కాలనీ మహిళలు తమ కాలనీలో ప్రచారానికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎస్ఆర్నగర్ రాయల సేవా సమితి అధ్యక్షులు ఆర్.సి.కుమార్ ఆధ్వర్యంలో శ్రీరామ్నగర్ కాలనీ మహిళలు మంత్రి తలసానికి మద్దతు పలికారు.