హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్ పాన్బజార్లో గల అర్బన్ ఫ్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను మంత్రి తలసాని పంపిణీ చేశారు. ముందుగా యూపీహెచ్సీలో వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఐసీయూ బెడ్స్ వార్ట్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రూ. 33 లక్షల విలువ చేసే ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, తదితర పరికరాలను అందజేసిన సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయినప్పటికీ స్వచ్చంద సంస్థలు చేయూతను అందించడం అభినందనీయం అన్నారు. ఇక్కడికి వచ్చే వారికోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈ ఆస్పత్రిని దత్తత తీసుకోవాలని వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఉపాధ్యక్షుడు భూషణ్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.
హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపడతామని మంత్రి ప్రకటించారు. కరోనా క్లిష్ట సమయంలో ఆశా వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా పని చేశారని ప్రశంసించారు. వారి సేవలు గుర్తించి దేశంలో ఎక్కడా లేని వేతనాలు అందిస్తున్న గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కూడా ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం హైదరాబాద్ జిల్లాలోని 1385 మంది ఆశా వర్కర్లకు రూ. కోటి 25 లక్షల వ్యయంతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ఆస్పత్రిలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, కావాల్సిన పరికరాలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డీఎంహెచ్వో వెంకట్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. హాస్పిటల్ను తమ ఇంటిలా భావించి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డిప్యూటీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.