తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ. దీనిని ఆడబిడ్డలందరూ ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017 సంవత్సరం నుంచి చీరలను బహుమతిగా అందజేస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా 18సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి మహిళకు తీరొక్క రంగులతో కూడిన చీరలు అందజేస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చేనేత చీరల పంపిణీ కార్యక్రమం నగర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. అంచుల చీరలు అందుకుంటున్న అతివలు ఆనంద పడుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జూబ్లీహిల్స్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ)/అమీర్పేట్, సెప్టెంబర్ 23 : సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం హయాంలో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని సనత్నగర్ జీహెచ్ఎంసీ మైదానం, బన్సీలాల్పేట్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లు కొలను లక్ష్మిరెడ్డి, కేతినేని సరళ, మహేశ్వరి శ్రీహరి, హేమలతతో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.18కోట్ల మంది మహిళలు 30 రకాల డిజైన్లతో తయారు చేసిన బతుకమ్మ చీరలు అందుకుంటున్నారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో 52,261 మందికి బతుకమ్మ చీరలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, డిప్యూటీ కమిషనర్లు ముకుందరెడ్డి, మోహన్రెడ్డిలతో పాటు పద్మారావునగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్కుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, సురేష్గౌడ్, సంతోష్ సరఫ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ సరిల్లోని సీఎంటీసీలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2017 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు బతుకమ్మ పండుగ సందర్భంగా 18ఏండ్లు నిండిన ప్రతి మహిళకు చీర కానుకగా అందజేస్తున్నారని తెలిపారు. ఈనెల 25నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 9రోజులపాటు జరుపుకునే పండుగను మహిళలు సమిష్టిగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న ప్రతిఒకరికీ 1347 రేషన్ షాపుల ద్వారా చీరలు అందజేస్తున్నామని చెప్పారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.