ఖైరతాబాద్, సెప్టెంబర్ 28 : ఖైరతాబాద్లో కొలువుదీరిన దశ మహా విద్యా గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది. ఈ నెల 18న వినాయకచవితి మొదలు నవరాత్రుళ్లు విశేష పూజలందుకున్న స్వామి వారు గురువారం గంగమ్మ చెంతకు చేరారు. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహం ప్రతిష్టించడం ఓ చరిత్ర కాగా, భారీగా భక్తులు కూడా దర్శించుకోవడం మరో రికార్డు. బుధవారం అర్ధరాత్రి నుంచే నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు ఆరు గంటలకు పైగా సాగిన శోభాయాత్రతో మహాక్రతువు ముగిసింది. శోభాయాత్రలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్, కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బుధవారం
అర్ధరాత్రి 12గంటలకు మండపం వద్ద ఉన్న కర్రల తొలగింపు
12.15 నుంచి 1గంట వరకు ఉత్సవ కమిటీ కలశ పూజ
1.15 గంటలకు మండపం వద్దకు చేరుకున్న క్రేన్
2.45 గంటలకు క్రేన్ సాయంతో ట్రాలీ మీదకు మహా గణపతి
4గంటల వరకు వెల్డింగ్, అలంకరణ పనులు
గురువారం
ఉదయం 6.12 శోభాయాత్ర ప్రారంభం
8.30 గంటలకు సెన్షేషన్ థియేటర్
9.05 గంటలకు లక్డీకాపూల్ చౌరస్తా
9.20 గంటలకు టెలిఫోన్ భవన్
9.45 గంటలకు పాత సచివాలయం గేటు
10.35 గంటలకు కొత్త తెలంగాణ సచివాలయం
11.40 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం.4 వద్దకు
మధ్యాహ్నం 12.24గంటలకు స్వామి వారి తుది పూజ
1.04గంటలకు స్వామి వారి విగ్రహం క్రేన్ సాయంతో పైకి
1.20 గంటలకు భక్తుల దర్శనం కోసం గాలిలో విగ్రహం
1.27 గంటలకు గంగమ్మ చెంతకు చేరిన గణేశుడు
నిమజ్జనోత్సవం సందర్భంగా భారత జాగృతి వేదికను లుంబినీ పార్క్కు ఎదురుగా ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించారు. హెల్త్ క్యాంప్లో భాగంగా పలువురికి వైద్య పరీక్షలు జరిపారు. ఎమ్మెల్సీ కవిత సూచనలతో కార్యకర్తలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించారు.
గణపతి నిమజ్జన ప్రక్రియలో పోలీసులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ విధులు నిర్వర్తించారు. గణపయ్య చుట్టుతా రోప్ భద్రతలో భాగంగా వారంతా పోలీసులతో పాటు శోభాయాత్ర సజావుగా సాగేలా కృషి చేశారు. భక్తులందరూ క్రమశిక్షణ పాటించేలా వారికి సూచనలు చేస్తూ సేవలందించారు.
గణనాథులంటే ముంబయి, పుణె గుర్తుకు వచ్చేది. కానీ నేడు దేశమంతా హైదరాబాద్నే చూస్తున్నది. మహానగరంలో 90 వేల విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని 50లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన ఘట్టం పూర్తి చేశారు.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్