Minister Srinivas Yadav | హైదరాబాద్ నగరంలోనే సనత్నగర్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తన లక్ష్యం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ డివిజన్లోని శివాజీనగర్, గాంధీ విగ్రహం, ఎస్ఆర్టీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టి.. పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. కారు గుర్తుకే ఓటు అంటూ ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సనత్నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. నగరంలోనే అత్యధికంగా సనత్నగర్లో పార్క్లున్నాయని, వాటిని అన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను సైతం ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. మంచినీటి రిజర్వాయర్ను నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు వివరించారు. నియోజకవర్గంలో 50సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసినట్లు వివరించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులను తాము చేశామని చెప్పారు.
తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నందున ప్రజల అవసరాలు, నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.