సనత్నగర్/జూబీహిల్స్ జోన్ బృందం, సెప్టెంబర్ 2: ప్రజాభిమానంతో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం ఉదయం సనత్నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్పేట్ డివిజన్ జబ్బార్ కాంప్లెక్స్ చౌరాస్తాలో టీఆర్ఎస్ జెండా పండుగను పురస్కరించుకొని పార్టీ పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో పరుగులు పెడుతుండటాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. పద్మారావునగర్ పార్కు చౌరస్తాలో టీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్, రాంగోపాల్పేట్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్ శేషుకుమారి, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ పాల్గొని జెండాను ఆదష్కరించారు. ఈ సందర్భంగా తలసాని సాయియాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి తలసాని నాయకత్వంలో టీఆర్ఎస్ ఇంటింటికీ చేరిందన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్గౌడ్, కొలను బాల్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని ప్రగతిబాటన నడిపిస్తున్న సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు ఆయుష్షును పొందాలని కోరుతూ అమీర్పేట్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ సభ్యుడు సర్దార్ సురీందర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో మాజీ కార్పొరేటర్ శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుగులేని విధంగా సీఎం కేసీఆర్ పాలన మరింత కాలం కొనసాగాలని కోరారు. ప్రార్థనల్లో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గులాబ్సింగ్ రాజ్పురోహిత్, కూతురు నర్సింహ, అశోక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేలా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఘనత టీఆర్ఎస్కే దక్కిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మా గంటి గోపీనాథ్ అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతులమీదుగా భూమి పూజ చేసిన శుభసందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి ఆధ్వర్యంలో వేలాది బైక్లతో నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. షేక్పేట డివిజన్లో ప్రారంభమైన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించి స్వయంగా బైక్ నడిపిస్తూ నియోజకవర్గం మొత్తం వేలాదిమంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు.
షేక్పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ. వెంగళరావునగర్, బోరబండ, రహ్మత్నగర్ ప్రాం తాల మీదుగా ర్యాలీ కొనసాగింది.ప్రధాన రహదారులన్నీ జై తెలంగాణ నినాదాలతో మార్మోగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర సాధన లక్ష్యంతో 20 ఏండ్ల క్రితం ఏర్పడిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.