బేగంపేట్ జూలై 23: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల జాతరను ఈ నెల 25, 26న వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు, ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పూర్తిగా సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం చేస్తున్న జాతర ఏర్పాట్లను ఆయన స్థానిక పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. బారికేడ్లు, విద్యుత్ లైట్లు, అలంకరణ తదితర పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ఉత్సవాలకు నగర ప్రజలే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్టు వెల్లడించారు. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తులకు తాగునీళ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా పోలీసులు ఉంటారని తెలిపారు. క్యూలైన్లు, మీడియా పాయింట్ల ఏర్పాటులో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పాయింట్ల్ను, క్యూలైన్లను మార్చాల్సి వచ్చిందని స్థానిక పోలీసులు చెప్పారు. కార్యక్రమంలో ఈవో మనోహర్రెడ్డి, కార్పొరేటర్ చీర సుచిత్ర, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీపీ కల్మెశ్వర్ సింగన్వార్, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.