హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్కు చెందిన మత్స్యకారులు మంత్రి తలసానికి కొర్రమీను చేపలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయ భారీగా పెరిగిందని, ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మంత్రికి కొర్రమీను చేపలను అందిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో శాడా కోటేశ్వరరావు, గడప దేవేందర్, గరిగే నరసింగరావు, గరిగే సంపత్ తదితరులు ఉన్నారు